హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘జంజీర్' తెలుగు వెర్షన్ ‘తుఫాన్' చిత్రం చిత్రం ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఏపీలో మాత్రం ఈ చిత్రానికి కష్టాలు తప్పేట్లు లేవు. ముఖ్యంగా ఈచిత్రాన్ని సీమాంధ్ర ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే స్పష్టం అవుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో ‘తుఫాన్' చిత్రాన్ని సమైక్య వాదులు అడ్డుకుంటున్నారు. ఆ చిత్రం పోస్టర్లు తగుల బెట్టారు. చిరంజీవిపై కోపంతోనే సమైక్య వాదులు రామ్ చరణ్ సినిమాను అడ్డుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో తుఫాన్ సినిమా థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ఈ కారణంగా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు రామ్ చరణ్ బాలీవుడ్ కెరీర్పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన చిత్ర నిర్మాతలు ముదస్తుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విడుదలయ్యేలా చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు ఆదేశించాలని కోర్టుకు విన్నవించడంతో స్పందించిన కోర్టు, ఈ మేరకు భద్రత కల్పించాలని గురువారం డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పరిస్థితి గమనిస్తే తుఫాన్ చిత్రాన్ని కాపాడటం పోలీసులు వల్ల కాదని స్పష్టం అవుతోంది. సినిమా వివరాల్లోకి వెళితే...1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జంజీర్' చిత్రానికి రీమేక్గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.
తుఫాన్: పోస్టర్స్ తగులబెట్టారు, చిరు సొంతూర్లో
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను సమైక్యవాదులు శుక్రవారం పలుచోట్ల అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి పోస్టర్స్ చించివేశారు. సినిమాను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో, చిత్తూరు జిల్లా తిరుపతి సత్యవేడులలోను సమైక్యవాదులు సినిమాను అడ్డుకున్నారు. నర్సాపురం, పాలకొల్లులలో థియేటర్ల వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. బెనిఫిట్ షో వేయకుండా అడ్డుకున్నారు. థియేటర్ల వద్ద పోస్టర్స్ తగులబెట్టారు. చిరంజీవి స్వగ్రామమైన మొగల్తూరులోను తుఫాన్కు సమైక్య సెగ తగిలింది. పలువురు సమైక్యవాదులు తుఫాన్ సినిమా థియేటర్ ముందు నిరసనకు దిగారు.
మరోవైపు, తెలంగాణలోను చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేటలో సమైక్యవాదులు రామ్ చరణ్ తేజ తుఫాన్ సినిమాను అడ్డుకుంటామని గురువారం హెచ్చరించారు. కాగా, చిరంజీవి తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణవాదులు, సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయక పోవడం వల్ల సమైక్యవాదులు ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
0 comments