హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రానికి తెలంగాణ సెగ తగులుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతుండటంతో ఆయన సోదరుడు పవన్ చిత్రాన్ని అడ్డుకుంటామని ఓయు జెఏసి, తెలంగాణవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పవన్ అత్తారింటికి దారేది చిత్రం విడుదలైంది. దానికి తెలంగాణలోని పలు జిల్లాల్లో సెగ తగిలింది. నిజామాబాద్లో ఉషా ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద పలువురు తెలంగాణవాదులు సినిమా పోస్టర్ను దగ్ధం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
వరంగల్ జిల్లాలోను అత్తారింటికి దారేది చిత్రానికి తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. వరంగల్లోని ఏషియన్ థియేటర్ వద్ద కొందరు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల థియేటర్ల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.
0 comments