వైసీపీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఇప్పటికే పలువురు ఐఏఎస్లు, పారిశ్రామికవేత్తలకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ యజమాని పునీత్ దాల్మియాకు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది. సున్నపురాయి గనులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిందంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టుకు వెళ్లిన పునీత్ దాల్మియా ఇందులో తనకేమీ సంబంధం లేదని వాదించారు. దాల్మియాపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయనపై విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే... కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్ పేట గ్రామాల్లోని 407.05 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం జయా మినరల్స్కు మంజూరైన ప్రాస్సెక్టింగ్ లీజును సజ్జల దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్కు, దాని నుంచి దాల్మియా సిమెంట్స్కు అక్రమ మార్గాల్లో బదలాయింపు జరిగిందని, దీనికి ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి కుమారుడైన వైయస్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా రూ. 95 కోట్లు పెట్టుబడి పెట్టారని సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ను 2013 మే 13న సీబీఐ కోర్టు విచారణ నిమిత్తం పరిగణన(కాగ్నిజెన్స్)లోకి తీసుకుంది. కాగ్నిజెన్స్తో పాటు తనపై ఉన్న కేసును కొట్టి వేయాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఎం.ఎస్.కే జైశ్వాల్ సీబీఐ నమోదు చేసిన కేసులో అభియోగాలతో నమోదుతో సహా విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
0 comments